ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నెల 13 వ తేదీన అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంటు స్థానాలకు ఒకేసారి, ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. ఇప్పటివరకు ఎన్నికలపై ఆసక్తి చూపిన పార్టీలు, నేతలు, కార్యకర్తలు, ప్రజలు.. ఇప్పుడు ఫలితాల గురించి తీవ్ర ఉత్కంఠతో వేచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ రాయుళ్లు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వేలకోట్ల రూపాయలు బెట్టింగుల పేరు మీద చేతులు మారుతున్నాయి. అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో ఏ పార్టీ, ఏ అభ్యర్థి గెలుస్తారని బెట్టింగ్ పెడుతున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపైనే అందరి ఆసక్తి నెలకొంది. ఒక్క పిఠాపురం నియోజకవర్గంపైనే రూ.500 కోట్లకుపైగా బెట్టింగ్లు వేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.