ఇరాన్ రాజధాని తెహ్రాన్లో సైన్యానికి చెందిన ఓ కార్గో విమానం కుప్పకూలింది. ఆ దేశ మీడియా సమాచారం ప్రకారం విమానంలో 16మంది ఉన్నట్లు తెలుస్తోంది. విమానం ల్యాండ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదం నుంచి ఒక్కరు మాత్రమే సురక్షితంగా బయటపడగా మిగతా 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఇరాన్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రతినిధి రీజా జాఫర్జాదేహ్ ధ్రువీకరించారు. మాంసం సరఫరా చేసేందుకు కిర్గిస్థాన్ రాజధాని బిషెక్ నుంచి ఈ కార్గో విమానం బయల్దేరింది.
అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పైలెట్ విమానం వేరే రన్వేపై దించేందుకు ప్రయత్నిస్తుండగా పక్కనే ఉన్న భవనాన్ని ఢీకొట్టి కుప్పకూలిపోయింది.విషయం తెలుసుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. విమానం కూలిన ప్రదేశంలో భారీ ఎత్తున పొగ వ్యాపించింది. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. హెలికాప్టర్, అంబులెన్స్తో సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఘటనా స్థలం నుంచి ఇప్పటికే పలు మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.