ఏపీ ఎన్నికల్లో ఈసారి ప్రముఖంగా వినిపిస్తున్న నియోజకవర్గాలలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటమే అందుకు కారణం. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండుచోట్ల ఓడిపోవటంతో.. ఈసారి ఎలాంటి తప్పులు జరగకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. అందుకే ఒకేచోట పోటీ చేయాలని భావించి.. చాలా రోజుల ఎదురుచూపుల తర్వాత పిఠాపురం నుంచి పోటీ చేస్తు్న్నట్లు ప్రకటించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గం పేరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే పిఠాపురం పేరు ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అందుకు కారణం ఓ చెప్పులు కుట్టుకునే వ్యక్తి.
పిఠాపురం నుంచి చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఎన్నికల బరిలో నిలిచారు. ఏడిద భాస్కరరావు అనే వ్యక్తి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. భాస్కరరావు కుటుంబం సీతయ్యగారితోటలో నివశిస్తోంది. అయితే ఇంటర్ వరకు చదివిన భాస్కరరావు స్థానిక ప్రభుత్వ కాలేజీ వద్ద చెప్పులు కుట్టడం ప్రారంభించారు. అలా చెప్పులు కుడుతూ ఓ వైపు తన కుటుంబాన్ని పోషిస్తూనే.. మరోవైపు తన చదువు కొనసాగించారు. అలా ఎంఏ రాజనీతిశాస్త్రం అధ్యయనం చేశారు. అయితే పుట్టినగడ్డకు ఏదైనా సేవ చేయాలని భావించిన భాస్కరరావు.. ఎన్నికల బరిలో నిలిచారు. నియోజకవర్గ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కూడా తయారుచేసుకున్నారు. వీటితో సొంతంగా మ్యానిఫెస్టో రూపొందించారు భాస్కరరావు.
ఇక నామినేషన్ దాఖలు చేసేందుకు నియోజకవర్గంలోని ఓటర్లు బలపరచాల్సి ఉంటుంది. భాస్కరరావు గురించి తెలిసి పది మంది ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ఇక తన వద్ద ప్రస్తుతం 20 వేల రూపాయలు మాత్రమే ఉన్నట్లు భాస్కరరావు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. నియోజకవర్గ సమస్యల మీద, వాటి పరిష్కారాల మీద భాస్కరరావుకు అవగాహన ఉందని ఆయన గురించి తెలిసిన వ్యక్తులు చెప్తున్నారు. మొత్తంగా ఏడిద భాస్కరరావు వ్యవహారం ఇప్పుడు పిఠాపురంలో హాట్ టాపిక్గా మారింది.