సైకో సీఎం జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. విశాఖలో రుషికొండను బోడికొండగా మార్చేశారు. పలాసలో చిన్న సైకో మంత్రి సీదిరి అప్పలరాజు నెమలికొండ, సూదికొండ, నల్లబొడ్లూరు కొండలకు గుండుకొట్టారు’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. పలాసలో సోమవారం రాత్రి నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ నేతల తీరుపై ధ్వజమెత్తారు. కొద్దిరోజులే వైసీపీకి అధికారం ఉందని అందుకే జగన్ కొత్త డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. పలాస నియోజకవర్గంలో కొండలను సైతం వైసీపీ నేతలు ఆక్రమించడంతో గ్రామాల్లోకి ఎలుగుబంట్లు వచ్చేస్తున్నాయని పేర్కొన్నారు. మే నెలలో చెరువులో చేప ఎగిరిపోతుందని మంత్రి సీదిరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసింది. జనసైనికులు, బీజేపీ కార్యకర్తలు, టీడీపీ సైన్యం వైసీపీని తరిమేందుకు సిద్ధంగా ఉన్నారు. మా మూడు పార్టీల అజెండా ఒక్కటేనని.. ప్రజాసంక్షేమమే ధ్యేయం. రానున్న ఎన్నికల్లో ఎన్డీమే అభ్యర్థులను గెలిపించి.. వైసీపీని సాగనంపాల’ని పిలుపునిచ్చారు. వైసీపీ విధ్వంసకర పాలనపై ధ్వజమెత్తుతూ.. తాము అధికారంలోకి వస్తే చేపట్టనున్న అభివృద్ధిని వివరించారు.