అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. బైక్ను కారుతో ఢీకొట్టిన డ్రైవర్.. వాహనంపై పడిన మృతదేహంతో 18కి.మీ దూరం ప్రయాణించాడు. ఆత్మకూరు మండలం వై.కొత్తపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది.కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన జిన్నే ఎర్రిస్వామి ట్రాక్టర్ మెకానిక్. ఆత్మకూరు మండలంలోని పి.సిద్దరాంపురానికి చెందిన మంజులతో వివాహం కాగా.. అనంతపురంలో స్థిరపడ్డారు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. వ్యక్తిగత పనులపై పి.సిద్దరాంపురం వెళ్లి ఆదివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తిరుగు ప్రయాణమయ్యారు.
ఇంతలో వై.కొత్తపల్లి సమీపంలోకి రాగానే కళ్యాణదుర్గం వైపు వెళుతున్న కారు.. బైక్ను ఢీకొట్టి ఎదురుగా వెళ్లి ఢీకొంది. దీంతో ఎర్రిస్వామి ఎగిరి కారుపైన పడిపోయారు. గమనించని డ్రైవర్ వేగంగా కళ్యాణదుర్గం వైపు వెళ్లాడు. బెళుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి వద్ద కారుపై వ్యక్తి పడి ఉండటాన్ని వాహనదారులు గమనించి, అడ్డంగా వెళ్లి ఆపించారు. కారు పైభాగంలో మృతదేహం ఉండటాన్ని గుర్తించి అప్రమత్తం చేయడంతో డ్రైవర్ కారును వదిలి పరారయ్యాడు. కారు బెంగళూరుకు చెందినదిగా గుర్తించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.