ఏపీలో ఎన్డీఏ పక్షాల పొత్తులో తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది. మిత్రపక్షాలైన బీజేపీ 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లోనూ.. జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. 2 జాబితాల్లో కలిపి తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటించగా బీజేపీతో పొత్తు అనంతరం మూడు సీట్లు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అరకు అసెంబ్లీ స్థానానికి దొన్నుదొరను, పి. గన్నవరంలో మహాసేన రాజేష్, అనపర్తిలో నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిని అభ్యర్థులుగా ఇంతకుముందే తెలుగుదేశం ప్రకటించింది. వీటితో తెలుగుదేశం ప్రకటించాల్సిన అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చింది. మొత్తం 8 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. టీడీపీ చీపురుపల్లి, భీమిలి, పాడేరు, దర్శి, రాజంపేట, ఆలూరు, అనంతపురం అర్బన్, గుంతకల్లు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది.
ఈ పెండింగ్ నియోజకవర్గాల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే టీడీపీ కూటమి అభ్యర్థి ఎంపిక ఉత్కంఠరేపుతోంది. ఈ నియోజకవర్గంలో రోజుకో పేరు తెరపైకి వస్తోంది. దర్శి నుంచి వైఎస్సార్సీపీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరును ప్రకటించింది. ఆయనకు ధీటైన అభ్యర్థిని బరిలోకి దించాలని టీడీపీ కసరత్తు చేస్తోంది. ఈ రేసులో జిల్లాకు చెందిన శ్రీహర్షిణీ విద్యాసంస్థల అధినేత గోరంట్ల రవికుమార్, మాజీ ఎమ్మెల్యే గరటయ్య కుమారుడు కృష్ణచైతన్య, మాజీ ఎమ్మెల్యే దివంగత నరసయ్య కుమార్తె కె.లక్ష్మి, జనసేన నాయకుడు గరికపాటి వెంకట్ టికెట్ ఆశిస్తున్నారు.