శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు తిరుపతిలోని రైల్వేస్టేషన్, బస్టాండులో దిగగానే శ్రీవారి ఆలయం, స్థానికాలయాల సమాచారాన్ని డిస్ప్లే బోర్డుల ద్వారా తెలియజేయాలని టిటిడి ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో శనివారం సీనియర్ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుపతిలోని ముఖ్య కూడళ్లలోనూ తిరుమల, తిరుపతిలోని ఆలయాల దర్శనవేళలు, ఆర్జితసేవలు, వసతి గదులు తదితర సమాచారాన్ని ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డుల ద్వారా ప్రదర్శించాలని సూచించారు. సర్వదర్శనం, దివ్యదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు పొందిన భక్తులు వారికి కేటాయించిన సమయంలోనే క్యూకాంప్లెక్స్లోకి చేరుకునేలా తిరుమలలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. తిరుమలలో రద్దీ రోజుల్లో భక్తులు లగేజి ఎక్కడ డిపాజిట్ చేయాలి, ఎక్కడ తిరిగి పొందాలి అనే విషయాలను స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. రథసప్తమినాటికి మాడ వీధుల్లో ఎస్వీబీసీ, రేడియో బ్రాడ్కాస్టింగ్, సిసిటివి వైర్లు బయటకు కనిపించకుండా భూగర్భ కేబుల్ వ్యవస్థను పూర్తి చేయాలన్నారు.