ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలి.. ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 03, 2024, 04:00 PM

ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను మరో పదేళ్లు కొనసాగించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించే విషయమై కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించాలని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజా సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్ కుమార్ ఈ పిల్ దాఖలు చేశారు.


ఏపీ విభజన చట్టం ప్రకారం 2024 జూన్ రెండో తేదీ వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ కొనసాగుతుంది. అయితే ఈ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో పిటిషనర్ ఈ పిల్ దాఖలు చేశారు. ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీ పూర్తి కాలేదన్న పిటిషనర్.. అలాగే తొమ్మిదో షెడ్యూల్‌లో పేర్కొన్న కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తికాలేదని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో మరో పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఉంచాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. అలాగే ఏపీ విభజన చట్ట నిబంధనలను కేంద్ర హోంశాఖ అమలుచేయకపోవడాన్ని రాజ్యాంగ, చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని హైకోర్టును కోరారు.


కేంద్రం అనుసరించిన ఆశాస్త్రీయ విధానాల కారణంగా పదేళ్లు గడిచినా కూడా.. ఏపీకి రాజధాని లేకుండా పోయిందని పిటిషనర్ తన పిల్‌లో పేర్కొన్నారు. విభజన చట్టం అమల్లో తలెత్తిన సమస్యల పరిష్కారానికి కేంద్రం చర్యలు తీసుకోకపోవటంతో రెండురాష్ట్రాల మధ్య వివాదాలు కోర్టులకు చేరుతున్నాయన్నారు. అలాగే రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజన కూడా వివాదాలకు దారితీసిందని హైకోర్టుకు తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడే ఆస్తులు, అప్పులు విభజన జరగాలనీ.. లేకపోతే చట్టపరంగా ఏపీకి దక్కాల్సిన ప్రయోజనాలు దెబ్బతింటాయని పిటిషనర్ పేర్కొన్నారు.


మరోవైపు ఏపీ,తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అంశాన్ని వైసీపీ నేతలు తెరపైకి తెచ్చారు. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ అంశం చర్చలోకి వచ్చింది. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అనంతరం.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించే అంశమై కేంద్రాన్ని కోరతామని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో కొత్త రాజధాని నిర్మాణం కష్టమని.. విశాఖపట్నానికి రాజధానిని తరలించేంత వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలని కేంద్రాన్ని కోరతామని సుబ్బారెడ్డి అన్నారు. ఆ తర్వాత పలువురు ఏపీ మంత్రులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com