ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్ధరాత్రి వేళ పట్టాలపై లారీ బోల్తా.. రైలుకు ఎదురెళ్లి వందల ప్రాణాలు కాపాడిన వృద్ధ దంపతులు

national |  Suryaa Desk  | Published : Mon, Feb 26, 2024, 10:22 PM

అర్ధరాత్రి వేళ రైలు పట్టాలపై లారీ బోల్తాపడింది. ఇంతలో అదే మార్గంలో రైలు దూసుకొస్తోంది. చిమ్మచీకట్లు.. చేతిలో ఓ టార్చ్ తప్పా చుట్టూ ఎవరూ లేరు. ఇలాంటి పరిస్థితిలో ఓ వృద్ధ జంట పెద్ద సాహసం చేశారు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా రైలుకు ఎదురెళ్లి ప్రమాదాన్ని నివారించారు. వృద్ధ దంపతులు తమ వద్ద ఉన్న టార్చ్లైట్తోనే లోకో పైలట్కు సిగ్నల్ ఇచ్చి ఘోర దుర్ఘటన జరగకుండా నిలువరించిన ఈ ఘటన తమిళనాడులోని తెన్ కాశీ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేరళ నుంచి తమిళనాడులోని తూత్తుకూడికి ప్లైఉడ్ లోడుతో వెళ్తోన్న లారీ.. తెన్‌కాశీ వద్ద ఎస్.వేలవు ప్రాంతంలో అదుపుతప్పి రైల్వే ట్రాక్పై బోల్తా పడింది.


డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అదే సమయంలో తిరునెల్వేలి- పాలక్కడ్ ఎక్స్‌ప్రెస్ రైలు అటుగా వస్తోంది. అక్కడే ఉన్న షన్ముగయ్య, కురుంతామ్మల్ దంపతులు దీనిని గమనించారు. ఆ రైలును ఎలాగైనా ఆపాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ట్రాక్‌పై పరుగెత్తుతూ తమ చేతిలో ఉన్న టార్చ్లైట్తో లోకో పైలట్కు సిగ్నల్ ఇచ్చారు. దీనిని గమనించిన లోకో పైలట్ వెంటనే అప్రమత్తమై బ్రేకులు వేసి రైలును నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.


ప్రమాదంలో లారీ పూర్తిగా ధ్వంసం కాగా.. డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. క్లీనర్ మాత్రం ముందే ప్రమాదాన్ని ఊహించి దూకేయడంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. మృతిచెందిన డ్రైవర్ను ముక్కుదాల్ ప్రాంతానికి చెందిన మణికందన్(34)గా గుర్తించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తెన్‌కాశీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


ట్రాక్పై పడిపోయిన లారీని రైల్వే సిబ్బంది తొలగించి, మరమ్మతులు చేపట్టారు. ప్రమాదంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లను దారి మళ్లించగా.. కొన్ని ఆలస్యంగా నడిచాయి. పనులు పూర్తయిన అనంతరం రైళ్ల రాకపోకలకు అధికారులు అనుమతించారు. ఇక, ప్రాణాలకు తెగించి సాహసం చేసిన షణ్ముగయ్య, కురుంతమ్మాళ్‌ను అధికారులతో పాటు స్థానికులు కొనియాడుతున్నారు. ఎవరు ఎలాపోతే తమకేంటని స్వార్థంతో ఆలోచించే ఈ రోజుల్లో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మానవత్వానికి ప్రతీకగా నిలిచారని ప్రశంసిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com