ఆంధ్రప్రదేశ్ ను పెథాయ్ తుపాను తీవ్రంగా వణికించిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులకు పలు జిల్లాల్లో పంటలు నేలకొరగగా, ఆక్వా రైతులు సైతం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పెథాయ్ తుపాను తీరం దాటినప్పటికీ మరో మూడ్రోజుల పాటు వర్షాలు కురవడంతో పాటు చల్లటి గాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పెథాయ్ తాకిడి నేపథ్యంలో 28 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. తుపాను రాకముందు నాలుగు పడవల్లో సముద్రంలోకి వెళ్లిన జాలర్లు, అక్కడే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దుమ్ములపేట, పర్లాపేట, ఉప్పలంకకు చెందిన 28 మంది జాలర్ల జాడ ప్రస్తుతం తెలియరావడం లేదు. కాగా, గల్లంతయిన జాలర్ల కోసం అధికారులు రంగంలోకి దిగి గాలింపును ప్రారంభించారు. అంతకుముందు సముంద్రంలో ఓఎన్ జీసీ రిగ్ వద్ద చిక్కుకున్న ఏడుగురు జాలర్లను అధికారులు కాపాడగలిగారు. పెథాయ్ తుపాను ప్రభావంతో ఇప్పటికే 23 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, తమ కుటుంబ సభ్యుల జాడ తెలియకపోవడంలో మత్స్యకారుల కుటుంబాలు కన్నీరుమున్నీరు అవుతున్నాయి.