కొలంబో: శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్సె కొనసాగకూడదని అక్కడి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పు రాజపక్సెతోపాటు ఆయనను ఆ పదవిలో కూర్చోబెట్టిన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనను కూడా షాక్కు గురి చేసింది. ఈ మేరకు కోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రాజపక్సె, ఆయన కేబినెట్, డిప్యూటీ మంత్రులు ప్రభుత్వాన్ని నడపకూడదని స్పష్టంగా చెప్పింది. రాజపక్సె ప్రభుత్వానికి వ్యతిరేకంగా 122 మంది ఎంపీలు దాఖలు చేసిన కో వారెంటో పిటిషన్పై విచారణ జరిపి కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
అక్టోబర్ 26 నుంచి లంకలో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. అప్పటి ప్రధాని రానిల్ విక్రమసింఘెను తొలగించి రాజపక్సెను ఆ పదవిలో కూర్చోబెట్టారు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన. అయితే రాజపక్సె ప్రభుత్వాన్ని పార్లమెంట్లో మెజార్టీ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనపై మూడుసార్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో 20 నెలల ముందుగానే సిరిసేన పార్లమెంట్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి వెంటనే ఎన్నికలకు ఆదేశించారు. అయితే ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. పార్లమెంట్లో తనకు 225 మంది ఎంపీల మద్దతు ఉన్నదని, ప్రధాని పదవి తనకే దక్కాలని విక్రమసింఘె వాదిస్తున్నారు.