ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమస్యే లేదు వారందర్నీ పక్కన పెట్టేస్తా.. టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2023, 06:37 PM

టీడీపీ నేతలకు అధినేత చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో ఆయన సమావేశం అయ్యారు. గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్లు ఇస్తామని.. నాయకుల పనితీరు బాగాలేకపోతే ఉపేక్షించేది లేదన్నారు. పనితీరు బాగాలేకుంటే ప్రత్యామ్నాయం చూపించి పక్కన పెడతామన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఓట్ల అవకతవకల విషయాన్ని ఇంఛార్జ్‌లు బాధ్యతగా తీసుకోవాలి అన్నారు. అన్నీ పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందనే అలసత్వం వద్దని నేతలకు సూచించారు. రాష్ట్ర ప్రజలకు తెలుగు దేశం పార్టీ అవసరం ఎంతో ఉందన్నారు.


ప్రతి కార్యక్రమంలో తెలుగుదేశం - జనసేన నేతలు కలిసి వేదికను పంచుకోవాలని చంద్రబాబు సూచించారు. క్షేత్రస్థాయిలోనూ కలిసి పనిచేస్తూ జగన్‌ను ఇంటికి సాగనంపుదామని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై గ్రామస్థాయిలోనూ కలసి పోరాడాలని దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన నేతలతో కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. తెలుగుదేశం - జనసేన నిర్వహించే కార్యక్రమాల్లో నేతలు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని చంద్రబాబు వారితో అన్నారు. అనంతరం గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు కొట్టుకుపోయిన అంశాన్ని టీడీపీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గేటు కొట్టుకుపోయిందని నేతలు ఆరోపించారు. ఉదయమే సంఘటనాస్థలానికి వెళ్లి.. వారు చేసిన క్షేత్రస్థాయి పరిశీలనను చంద్రబాబుకు నేతలు వివరించారు.


సీఎం జగన్ ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ, పాలన గాలికొదిలేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మండిపడ్డారు. ప్రజాధనం దోచి దాచుకునే బిజీలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రాజెక్టులు కొత్తవి కట్టకపోగా, ఉన్న వాటి నిర్వహణనీ పట్టించుకోలేదని విమర్శించారు. ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకు కూడా నిధులు ఇవ్వలేని దిక్కుమాలిన పాలనలో.. గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు విరిగిపోయిందని లోకేష్‌ ఆరోపించారు. గతేడాది గుండ్లకమ్మ ప్రాజెక్టు మూడో గేటు కొట్టుకుపోయిందని.. నీరు వృథాగా పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.


ప్రాజెక్టుల నిర్వహణను జగన్ గాలికొదిలేశారని టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ సోమరితనంతో గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు ఊడి నీరు వృథాగా పోతోందని విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి బయటకు రాకుండా తమపై నిందలా అంటూ మండిపడ్డారు. టీఎంసీ - క్యూసెక్కుకు తేడా తెలియని వారికి నీటిపారుదల శాఖ కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ తీరు మారకపోతే ప్రాజెక్టుల దగ్గర ఆందోళనలు చేపడతామని అచ్చెన్న హెచ్చరించారు. మరోవైపు, గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద విరిగిన రెండో గేటును టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, స్వామి, టీడీపీ విజయకుమార్‌ తదితరులు పరిశీలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com