ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో విచిత్రమైన పరిస్థితి,,,,వీకెండ్‌లో కూడా భక్తుల రద్దీనే లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 02, 2023, 07:13 PM

తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త.. విచిత్రంగా కొండపై వీకెండ్‌లో భక్తుల రద్దీ తగ్గిపోయింది. ఇవాళ దర్శనం కోసం.. భక్తుల్ని నేరుగా క్యూలైన్‌లోకి అనుమతిస్తున్నారు. శుక్రవారం 56,950 మంది స్వామివారిని దర్శించుకోగా 20,463 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.75 కోట్లు వచ్చాయి. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు గంట నుంచి 3 గంటల్లో దర్శనం పూర్తవుతోంది.


తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. నవంబరు నెలలో 19.73 లక్షల మంది స్వామి వారి దర్శించుకున్నారని.. రూ.108.46 కోట్ల హుండీ ద్వారా భక్తులు స్వామి వారిని కానుకలు సమర్పించారన్నారు. 97.47 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించిందని.. 36.50 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించగా.. 7.06 లక్షల మంది భక్తులు స్వామి వారి తలనీలాలు సమర్పించారన్నారు.


ఇప్పటికే ఆన్‌లైన్‌లో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను విడుదల చేశామన్నారు. తిరుపతిలో ఆఫ్‌లైన్‌ టికెట్లను కౌంటర్లలో అందజేస్తామన్నారు. అంతేకాదు వైకుంఠ ద్వార దర్శన సమయంలో దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామన్నారు. డిసెంబరు 22 నుంచి 24 వరకు.. డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేశామన్నారు. ఈ సేవలను డిసెంబరు 25 నుంచి 30వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహిస్తారు. డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు సహస్రదీపాలంకార సేవను ఏకాంతంగా నిర్వహిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com