ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు ఏపీ లేఖ,,,,,సాగర్ సహా కీలక అంశాల ప్రస్తావన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 02, 2023, 07:02 PM

నాగార్జున సాగర్ నీటి కేటాయింపుల వ్యవహారంలో వివాదాలపై కేఆర్‌ఎంబీకి ఛైర్మన్‌కు ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ లేఖ రాశారు. సాగర్‌ స్పిల్‌వేలో సగభాగాన్ని ఏపీ స్వాధీనం చేసుకుందని.. కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్‌ ఫిర్యాదు చేసింది. కుడి కాలువకు నీటి విడుదలను ఆపేలా ఏపీ సర్కార్‌ను ఆదేశించాలని ఆ లేఖలో కోరింది. తెలంగాణ సర్కార్‌ ఫిర్యాదుపై కృష్ణా బోర్డు ఏపీ ప్రభుత్వం కూడా శుక్రవారం లేఖ రాసింది. వెంటనే తక్షణమే నీటి విడుదలను నిలిపేయాలన్న కృష్ణా బోర్డు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చుతూ శశిభూషణ్‌కుమార్‌ కౌంటర్ ఇచ్చారు.


శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కర్నూలు ప్రాజెక్ట్స్‌ సీఈకి, సాగర్‌ నిర్వహణ బాధ్యత ఆ ప్రాజెక్టు సీఈకి అప్పగించారని గుర్తు చేశారు. 2014 నుంచే తెలంగాణ భూభాగంలోని శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు ప్రాజెక్ట్స్‌ సీఈకి అప్పగించకుండా.. తానే నిర్వహిస్తోందన్నారు. అదే సమయంలో మా భూభాగంలోని సాగర్‌ కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను సైతం తెలంగాణ తన అదీనంలోకి తీసుకుందని తెలిపారు. ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ గత తొమ్మిదేళ్లుగా శ్రీశైలాన్ని ఖాళీచేస్తూ సాగర్‌కు తరలించి.. అటు సాగర్‌ ఎడమ కాలువలో తమ పరిధిలోని ఆయకట్టుకు నీళ్లందిస్తూ రాష్ట్ర హక్కులను తెలంగాణ హరిస్తోందని బోర్డుకు ఎన్నో సార్లు ఫిర్యాదు చేశామన్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను స్వాధీనం చేసుకోవాలని బోర్డును అనేకసార్లు కోరామన్నారు. లేదంటే ఏపీ భూభాగంలోని సాగర్‌ కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను ఏపీకి అప్పగించాలని కోరాం. కానీ, వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.


అక్టోబరు 6న త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సులతో శ్రీశైలం నుంచి 30 టీఎంసీలు.. నాగార్జున సాగర్‌ నుంచి 15 టీఎంసీలను ఏపీకి కేటాయిస్తూ కృష్ణా బోర్డు అక్టోబరు 9న ఉత్తర్వులిచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయించిందని.. ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ యథావిధిగా అదే రోజున ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభించి శ్రీశైలాన్ని తెలంగాణ సర్కార్‌ ఖాళీ చేసిందన్నారు. అప్పుడే బోర్డుకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని.. అందుకే ఏపీకి శ్రీశైలంలో కేటాయించిన 30 టీఎంసీల్లో కేవలం 13 టీఎంసీలనే వాడుకుందన్నారు. తెలంగాణ చర్యలవల్ల 17 టీఎంసీలను కోల్పోయామని లేఖలో ప్రస్తావించారు.


సాగర్‌ కుడి కాలువ కింద తమకు కేటాయించిన 15 టీఎంసీల్లో ఇప్పటివరకు ఐదు టీఎంసీలు వాడుకున్నామని గుర్తుచేశారు. మిగతా పది టీఎంసీలను వాడుకోనివ్వకుండా సాగర్‌ను తెలంగాణ ఖాళీచేస్తే.. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తాగునీటి ఎద్దడిని తీర్చడం సవాల్‌గా మారుతుందన్న ఆందోళనతోనే సాగర్‌ స్పిల్‌ వేను స్వాధీనం చేసుకుని, కుడి కాలువకు నీటిని విడుదల చేసి ఏపీ హక్కులను పరిరక్షించుకున్నామన్నారు.నీటి విడుదలను ఆపే ప్రశ్నేలేదన్నారు. కృష్ణా జలాలపై హక్కులను రెండు రాష్ట్రాల మధ్య ఉత్పన్నమైన వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. సాగర్‌ వివాదంతోపాటు కృష్ణా జలాల పంపకాలు, ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌ల నిర్వహణ బాధ్యతను కృష్ణా బోర్డుకు అప్పగించడంపై రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఉన్నత స్థాయి సమావేశం నేడు సమావేశం నిర్వహిస్తున్నారు. హైబ్రీడ్‌ విధానంలో (వీడియో కాన్ఫరెన్స్‌)లో ఈ సమావేశం జరుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com