ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్స్ తయారీ యూనిట్.. జర్మనీకి చెందిన ప్రముఖ కంపెనీ భారీ పెట్టుబడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 08:28 PM

ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్‌ బస్సులు, ట్రక్స్ తయారీ క్లస్టర్‌ యూనిట్‌ ఏర్పాటు కాబోతోంది. జర్మనీకి చెందిన ప్రముఖ కంపెనీ పెప్పర్‌ మోషన్ చిత్తూరు జిల్లా పుంగనూరులో రూ. 4,640 కోట్లతో 800 ఎకరాల విస్తీర్ణంలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. అతి త్వరలో భూమిపూజకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. పెప్పర్‌ మోషన్‌ సీఈవో ఆండ్రియాస్‌ హేగర్ తన ప్రతినిధి బృందంతో తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మీడియాతో ఆండ్రియాస్ హేగర్ మాట్లాడుతూ.. ‘ఏపీలో వరల్డ్‌ క్లాస్‌ యూనిట్‌ ఏర్పాటు చేయనుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. అత్యంత అధునాతన టెక్నాలజీతో మా యూనిట్‌ ఏర్పాటు చేయబోతున్నాం’ అని అన్నారు.


ప్రత్యేకతలు:


★ ఏడాదికి 30,000 ఎలక్ట్రిక్‌ బస్సులు, ట్రక్కులు తయారీ సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్‌ వర్టికల్‌ ప్రొడక్షన్‌ ఫెసిలిటీని పెప్పర్‌ మోషన్ కంపెనీ ఏర్పాటు చేయనుంది.


★ 20 జీడబ్ల్యూహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ తయారీ యూనిట్ ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ తయారయ్యే ఎలక్ట్రిక్‌ బస్సులు, ట్రక్కులకు ఈ బ్యాటరీలు అమరుస్తారు.


★ అంతర్జాతీయ ప్రమాణాలతో యూనిట్‌ ఏర్పాటు చేయబోతున్నారు.


★ డీజిల్‌ బస్సులు, ట్రక్కులను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చే రిట్రో ఫిట్టింగ్‌ వ్యవస్థ ఈ యూనిట్ మరో ప్రత్యేకత.


★ జర్మనీ ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన పెప్పర్‌ మోషన్‌ కంపెనీ.. యూరప్, యూఎస్‌ఏ, మెక్సికో, చైనాలో తన యూనిట్లను నెలకొల్పింది. లీడింగ్‌ గ్లోబల్‌ కార్పొరేషన్స్‌తో పార్ట్‌నర్‌షిప్‌ కలిగి ఉంది.


8,100 ఉద్యోగావకాశాలు:


ఈ యూనిట్ ద్వారా 8,100 మంది ఇంజినీర్లు, టెక్నీషియన్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఈ యూనిట్‌లో ఏర్పాటుచేయనున్న గ్లోబల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ద్వారా ఏషియా, మిడిల్‌ ఈస్ట్, ఆఫ్రికా లాంటి దేశాల్లోని పెప్పర్‌ భాగస్వామ్యులకు కూడా ఇక్కడి నుంచే సేవలు అందిస్తామని చెప్పారు. ఏపీ ప్రభుత్వ సహకారం, ఇక్కడ ఏర్పాటు చేస్తున్న యూనిట్‌కు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పెప్పర్‌ మోషన్‌ సీఈవో కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రీన్‌ ఎనర్జీకి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పారిశ్రామిక విధానాలు, సింగిల్‌ విండో అనుమతులు, పారదర్శక విధానాలపై పెప్పర్‌ మోషన్‌ ప్రతినిధులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వివరించారు.


‘మేం ఏపీలో యూనిట్‌ ఏర్పాటు చేయడం సరైన నిర్ణయంగా భావిస్తున్నాం. బెంగళూరు, చెన్నై నగరాలకు సమీపంలో మా యూనిట్‌ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రజా రవాణాకు అవసరమైన విధంగా డీకార్బొనైజ్‌డ్ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ తీసుకువచ్చేలా మా యూనిట్‌ నుంచి వాహనాల ఉత్పత్తి జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం మాకు అందించిన సహాయ సహకారాలు మరువలేనివి. సీఎం జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన విజనరీ థింకింగ్, పాలసీలు మమ్మల్ని ఆకట్టుకున్నాయి’ అని ఆండ్రియాస్‌ హేగర్ అన్నారు. ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, డాక్టర్‌ మథియాస్‌ కెర్లర్‌ (పెప్పర్‌ మోషన్‌ సీటీవో), ఫైనాన్స్‌ డైరెక్టర్‌ ఉవే స్టెల్టర్, ఉర్త్‌ ఎలక్ట్రానిక్‌ ఇండియా ఎండీ హర్ష ఆద్య, పెప్పర్‌ మోషన్‌ సీఐవో రాజశేఖర్‌ రెడ్డి నల్లపరెడ్డి, సీఎస్‌వో సత్య బులుసు, సీసీవో రవిశంకర్, అసోసియేట్‌ శ్రీధర్‌ కిలారు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com