ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు,,,,,ఇప్పటికే జిల్లాల్లో వానలు పడుతున్నాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 06:42 PM

ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందంటోంది వాతావరణశాఖ. దక్షిణ అండమాన్‌, మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి గురువారానికి వాయుగుండంగా మారుతుందని.. అనంతరం అది వాయవ్య దిశగా కదిలి శనివారానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ తుఫాన్‌కు మయన్మార్‌ సూచించిన ‘మిచౌంగ్‌’ అని పేరు పెట్టారు.. ఈ క్రమంలో డిసెంబరు 5 సాయంత్రం చెన్నైకు ఉత్తరాన కావలి సమీపంలో అతి తీవ్ర తుఫాన్‌గా తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు.


అంతేకాదు వచ్చే నెల 3న నైరుతి బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫాన్‌గా మారి తర్వాత ఉత్తర ఈశాన్యంగా పయనించి ఐదో తేదీ సాయంత్రం కాకినాడకు దగ్గరలో తీరం దాటుతుందని కూడా చెబుతున్నారు. తుఫాన్‌ తీరం దాటే సమయంలో అతి తీవ్ర తుఫాన్‌ నుంచి తుఫాన్‌గా మారుతుందంటున్నారు. మరో మోడల్‌ ప్రకారం డిసెంబరు 5 లేదా 6వ తేదీల్లో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా, ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాకు ఉత్తర భాగాన తీరం దాటుతుందని ఒక సంస్థ అంచనా వేసింది.


అయితే డిసెంబరు మొదటి వారంలో తుఫాన్ తీరం దాటొచ్చని.. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు... కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో డిసెంబరు 4 నుంచి 6 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే వెనక్కి రావాలని హెచ్చరికలు జారీ చేశారు. నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో బుధవారం తేలికపాటి వానలు కురుస్తాయంటున్నారు. అలాగే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.


అత్యధికంగా నెల్లూరు జిల్లా రాపూరులో 80.8 మిల్లీ మీటర్లు, తిరుపతి జిల్లా సత్యవేడులో 62.6, కడప జిల్లా కోడూరులో 61.8, తిరుపతి జిల్లా గూడూరులో 59.6, నెల్లూరు జిల్లా రాపూరులో 43.2, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 41.6, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 38.6, తిరుపతి జిల్లా తొట్టెంబేడులో 31.4, చిత్తూరు జిల్లా నగరిలో 30.2, తిరుపతి జిల్లా సూళ్లరుపేటలో 21.2, కడప జిల్లా వల్లూరులో 21.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పంటలు కోత దశలో ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో పొలాల్లో పంట సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని, కుప్పలను పటిష్టం చేసుకోవాలని సూచించింది. తుఫాన్‌ తీరం దాటే సమయంలో గంటకు 50 నుంచి 80 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచే అవకాశముందని, వరి కుప్పలపై బరువులు పెట్టాలని వాతావరణ నిపుణులు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com