ఏలూరు : రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, దానికి ఉదాహరణే దెందులూరు నియోజకవర్గంలో చూస్తున్నామని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లోని దెందులూరు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరడం లేదన్నారు. టీడీపీ కార్యకర్తలకు మాత్రమే సంక్షేమ పథకాలు చేరుతున్నాయని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ముసుగులో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా కోట్ల రూపాయలు దోచుకుంటున్నారన్నారు. పోలవరం లో ఎన్ని కోట్ల రూపాయలు దోచుకున్నామనేదానిపై ప్రతి సోమవారం ముఖ్యమంత్రి పోలవరం పర్యటన చేస్తున్నారన్నారు.
మా నాయకుడు జగన్ కు ప్రజాసంకల్ప యాత్ర ద్వారా వస్తున్న ప్రజాభిమానం ఓర్వలేక జగన్ మోహన్ రెడ్డి పై హత్యాయత్నం కు కొన్ని దృష్ట శక్తులు ప్రయత్నం చేశాయన్నారు. ఈ హత్యయత్నంపై చంద్రబాబు తీరు సరైనదికాదన్నారు. హత్యయత్నంపై విచారణ జరపాలని కేంద్రాన్ని కోరామని పేర్కొన్నారు. జగన్ పై హత్యాయత్నం ఘటనలో ఎంత పెద్ద నాయకులు ఉన్నా వదిలేది లేదన్నారు. ప్రజాసమస్యలపై పోరాడే వైయస్ ఆర్ పార్టీ నాయకులపై రౌడీషిట్లు పెడుతున్నారని, ప్రజాబలం ద్వారా ఎదుర్కోంటామన్నారు. అటువంటి వైయస్ ఆర్ పార్టీ నాయకులకు పార్టీ అండగా ఉంటుందన్నారు. టీడీపీ చేస్తున్న అరాచకాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారన్నారు.