ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని తుందుర్రు పరిసర భీమవరం, నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని 30 గ్రామాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఆక్వా ఫుడ్ పార్క్ ముట్టడికి పోరాట సమితి, సీపీఎం పార్టీలు పిలుపునిచ్చాయి. ఆక్వాఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో సుమారు 1100 మంది పోలీసులను మోహరించారు. ఆక్వాఫుడ్ బాధితులకు ప్రజాసంఘాలు, వామపక్షాలు, వైఎస్సార్ సీపీ మద్దతు తెలిపాయి. అలాగే మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజును పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. తుందుర్రు ఆక్వాఫుడ్ పార్క్ కమిటీ నాయకురాలు ఆరేటి సత్యవతి, సీపీఎం నేతలు బలరామ్, గోపాల్రావు సహా ఐద్వా నాయకురాలు కళ్యాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. కంశాలి బేతపుడిలో ఉద్యమకారుడు త్రిమూర్తులుతో పాటు పలువురు మహిళలను అరెస్ట్ చేశారు. పోలీసుల అత్యుత్సాహంతో నరసాపురం, భీమవరం, మొగల్తురు మండలాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఇప్పటికే పోలీసులు వందల మందిని అదుపులోకి తీసుకున్నారు.