మలేసియా వంటి ఆర్థికంగా చిన్న దేశాలకు ప్రయోజనకరంగా లేనందున ట్రాన్స్- పసిఫిక్ వాణిజ్య ఒప్పందాన్ని (టిటిపిని) సమీక్షించాలని మలేసియా ప్రధాని మహతీర్ మహ్మద్ పేర్కొన్నారు. జపాన్కు ఒక ఫైనాన్షియల్ పత్రికకు ఆయన శనివారం ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ జపాన్, కెనడాలతో కూడిన ఈ వాణిజ్య ఒప్పందంలో వివిధ దేశాల అభివృద్ధి స్థాయిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. చిన్న, బలహీన ఆర్థిక పరిస్థితులున్న దేశాలకు తమ ఉత్పత్తులను రక్షించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. ఒప్పందం నుంచి అమెరికా వైతొలిగాక, గట్టి సంప్రదింపులతో 11 దేశాల భాగస్వామ్యంతో ఈ ఏడాది ప్రారంభంలో టిపిపి రూపుదిద్దుకుందని గుర్తు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 13 శాతానికిపైగా ఉన్న దేశాల్లో, 10 ట్రిలియన్ డాలర్ల స్థూల దేశీయ ఉత్పత్తిలో అమెరికాయే దాదాపు 40 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తోందని, అందువల్ల టిటిపిలో ఉన్న 11 దేశాలు సుంకాలను తగ్గించుకుని వాణజ్యపరంగా సహకరించుకోవచ్చని ఆయన సూచించారు. తాము టిటిపిని తిస్కరించడంలేదని, దీన్ని నుంచి వైతొలగాలనుకోవడం లేదని కూడా ఈ ఇంటర్య్యూలో మహతీర్ స్పష్టం చేశారు.