ఇకపై తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే వారిలో సామాన్య భక్తులకు ప్రాధాన్యమివ్వనున్నట్లు టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ తెలిపారు. ఈ రోజు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇకపై భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. పాలకమండలి సభ్యుడిగా పనిచేసిన అనుభవంతో భక్తులకు వీలైనంత త్వరగా స్వామి వారి దర్శనమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా మరికొద్దిసేపటిలో పుట్టా సుధాకర్, పాలకవర్గ సభ్యులు ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.