తిరుమల: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు నేడు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న ఈ పరిణయోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. పరిణయోత్సవ మండపాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. అష్టలక్ష్ములు, చిన్నికృష్ణుడు, వెన్నకృష్ణుడు తదితర దేవతామూర్తుల ఆకృతులను ఏర్పాటు చేశారు. మధ్యమధ్యలో క్రిస్టల్ బాల్స్, క్రిస్టల్ పిల్లర్స్, షాండ్లియర్లు ఉన్నాయి. ఊంజల మండపాన్ని చెరకు గడలు, ఆపిల్, నారింజ, ద్రాక్ష, మొక్కజొన్న కంకులు, అనాస పండ్లు, రంరంగుల పుష్పాలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. మూడు రోజులపాటు జరుగనున్న ఈ వేడుకలో తొలిరోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనంపై, రెండవరోజు అశ్వవాహనంపై, చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్క ఉభయనాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తరువాత కల్యాణమహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.