వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి నుంచి ఉదయం ప్రారంభమైన జగన్ 136వ రోజు పాదయాత్ర కనకదుర్గ వారధి గుండా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. విజయవాడ బందరు రోడ్డుకు చేరుకున్న జగన్కు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కృష్ణా జిల్లాలో 13 నియోజకవర్గాల్లో 270 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. కృష్ణా జిల్లాలోకి ప్రవేశించిన జగన్ పాదయాత్ర వెటర్నరీ ఆస్పత్రి సెంటర్, శిఖామణి సెంటర్, పుష్పా సెంటర్, సీతారాంపురం మీదుగా కొత్త వంతెన దాకా కొనసాగనుంది. సాయంత్రం చిట్టీనగర్లో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు. వైకాపా అధినేత జగన్ పాదయాత్ర సందర్భంగా విజయవాడలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసుల మధ్య సమన్వయం కొరవడటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. పలువురు మంత్రులు, ఐఎఎస్ అధికారులు ట్రాఫిక్లో చిక్కుకుపోయారు.