అమరావతి : పార్లమెంటు సమావేశాల చివరి రోజైన నేడు మరింత ఉధృతంగా పోరాటం చేయాలని ఎంపిలకు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. చంద్రబాబు ఎంపిలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. టిడిపి ఎంపిల పోరాటం రాష్ట్రంలో పోరాటాలకు స్ఫూర్తినిచ్చిందని ఆయన అన్నారు. నాటకాలాడుతూ రాష్ట్రానికి నష్టం చేయవద్దని వైకాపా నేతలకు చంద్రబాబునాయుడు విన్నవించారు. వైకాపా సభ్యులు మోడీ తరఫున నిలుస్తారా లేక ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నిలుస్తారా తేల్చుకోవాలని ఆయన అన్నారు. గతంలో బ్రిటిష్ వారికి స్థానికులే కొందరు అండదండలిచ్చారని, అదే పద్ధతిలో ఇప్పుడు వైకాపా కేంద్ర ప్రభుత్వానికి కొమ్ము కాస్తోందని చంద్రబాబు దుయ్యబట్టారు. వైకాపా ఎంపిలలో అయిదుగురే రాజీనామా చేస్తారని, ఇద్దరు రాజీనామా చేయరని ప్రకటించడం నాటకం కాదా అని ఆయన ప్రశ్నించారు. రాజీనామా చేస్తే మొత్తం అందరూ రాజీనామా చేయాలని ఆయన అన్నారు. రాజ్యసభలో టిడిపి ఎంపిల మెరుపు ధర్నా జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించిందని చెప్పారు. పార్లమెంటులో టిడిపి ఎంపిలు వీరోచిత పోరాటం చేస్తున్నారని, ఎంపిల పోరాటాన్ని 5 కోట్ల మంది ప్రజలు హర్షిస్తున్నారని ఆయన అన్నారు. ఎంపిలంతా ఒక సంకల్పంతో పోరాటం చేస్తున్నారని ఆయన చెప్పారు. మన పోరాటంలో చిత్తశుద్ధి ఉందని, లక్ష్య సిద్ధి కోసం పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. ఇది నా విధి కర్తవ్యం బాధ్యత అని ప్రతి ఒక్కరూ భావించాలని ఆయన కోరారు.