ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సొంతూరిలో మలాలా పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 31, 2018, 12:16 PM

నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌ శనివారం తన సొంత ఊరైన స్వాత్‌‌ లోయకు వచ్చింది. రెండు రోజుల క్రితం ఆమె తన స్వదేశం పాకిస్థాన్‌కు వచ్చిన విషయం తెలిసిందే.  2012లో తాలిబన్‌ ఉగ్రవాదులు దాడి జరిగిన తర్వాత మలాలా పాక్‌కు రావడం ఇదే తొలిసారి.కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ ఉదయం తల్లిదండ్రులతో కలిసి ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని స్వాత్‌‌ జిల్లాకు చేరుకుంది. పర్యటనలో భాగంగా మలాలా తాను ఒకప్పుడు చదువుకున్న పాఠశాల, మింగోరాలోని తమ పూర్వీకుల ఇంటిని సందర్శించనుంది. షంగ్లా జిల్లాలో ఓ బాలికల పాఠశాలను కూడా ప్రారంభించనుంది.


బాలికా విద్య, మానవహక్కుల కోసం ప్రచారం చేసిన మలాలాపై 2012 అక్టోబర్‌ 9న తాలిబన్‌ ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. స్కూల్‌ బస్సులోకి చొరబడి ముష్కరులు ఆమెపై కాల్పులు జరిపారు. అయితే అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం మలాలాను ఆమె తల్లిదండ్రులు బ్రిటన్‌లోని బర్మింగ్హమ్‌ తీసుకెళ్లారు. అయితే పాకిస్థాన్‌కు వస్తే మళ్లీ దాడి చేస్తామని తాలిబన్‌ హెచ్చరించడంతో మలాలా కుటుంబం బ్రిటన్‌లోనే ఉండిపోయింది. ప్రస్తుతం అక్కడే ఆమె విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తోంది.అయితే తాలిబన్‌ దాడి తర్వాత తొలిసారిగా గత గురువారం మలాలా పాకిస్థాన్‌కు వచ్చింది. ఈ సందర్భంగా ఓ మీడియాతో మాట్లాడుతూ.. తన చదువు పూర్తయిన అనంతరం పాక్‌కు శాశ్వతంగా తిరిగి వస్తానని చెప్పింది. మానవ హక్కులు, బాలిక విద్య కోసం ఆమె చేసిన పోరాటానికి గానూ 2014లో నోబెల్‌ శాంతి బహుమతి వరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com