చెన్నై: తమిళనాడులో ఇవాళ్టి(మార్చి 1) నుంచి పెప్సీ, కోకా- కోలా శీతలపానీయాలు దుకాణాల నుంచి కనుమరుగవుతున్నాయి. విదేశీ బ్రాండ్ల అమ్మకాలను తగ్గించి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో వర్తకులు వీటి బహిష్కరణకు పిలుపిచ్చిన సంగతి తెలిసిందే. పెప్సీ, కోకా-కోలా లాంటి బహుళజాతి కంపెనీలు శీతలపానీయాలు ఉత్పత్తి చేయడానికి తమిళనాడులోని నీటివనరులను దోచుకుంటున్నాయని వర్తక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ సందర్భంగా అన్నై పళముదిర్ చోలై మేనేజర్ వి.త్యాగరాజన్ మాట్లాడుతూ.. ‘జల్లికట్టు ఆందోళన జరిగినప్పటి నుంచి మేము విదేశీ బ్రాండ్లు కోక్, పెప్సీలను విక్రయించడం ఆపేశాం. మా ప్రాంతీయ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నాం’ అన్నారు.రాష్ట్రంలో దాదాపు 20 లక్షల దుకాణాలు తొమ్మిది వర్తక సంఘాలకు అనుబంధంగా ఉన్నాయి. ఇందులో చాలావరకు బుధవారం నుంచి విదేశీ శీతలపానీయాల విక్రయం ఆపేస్తున్నాయి. ఇది పక్కనపెడితే.. సూపర్ మార్కెట్లు, హోటళ్లు మాత్రం వీటిని విక్రయిస్తూనే ఉన్నాయి.
మార్చి 1 నుంచి తమ సభ్యులు, ప్రజలతో కలిసి విదేశీ ఉత్పత్తులకు వ్యతిరేకంగా ప్రచారం చేపడుతున్నామని, ప్రాంతీయంగా తయారు చేస్తున్న శీతలపానీయాలనే అమ్ముతామని టీఎన్వీఎస్పీ అధ్యక్షుడు ఎ.ఎమ్. విక్రమ్రాజా అన్నారు. ఇది నిషేధం కాదని, ఆ పెద్ద కంపెనీలకు సాయపడేబదులు స్థానిక కంపెనీలకు ప్రోత్సాహమిద్దామని తమ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన అన్నారు. టీఎన్వీఎస్పీ పరిధిలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల వర్తక సంఘాలు పనిచేస్తున్నాయి. ఇందులో దాదాపు 15 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు