తిరుమల: తిరుమలలో భక్తకోటికి తితిదే అందిస్తున్న ఉచిత సేవలను ఇంకా విస్తరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో సాంబశివరావు వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనం సమావేశ మందిరంలో దేవస్థానంలోని వివిధ విభాగాధిపతులతో తిరుమల జేఈవో శ్రీనివాసరాజుతో కలిసి మంగళవారం ఈవో సమావేశం నిర్వహించారు. అనంతరం తిరుమలలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులతో, మీడియాతో వేర్వేరుగా మాట్లాడారు. వేసవి సెలవుల్లో రద్దీ పెరుగుతుందని, యాత్రికులకు సేవలందించడానికి సన్నద్ధమవుతున్నట్లు వివరించారు. లగేజీ భద్రపర్చుకోవడం, యాత్రిసదన్లలో వసతి కల్పన, తలనీలాలు సమర్పించుకునే కల్యాణకట్టల్లో పరిశుభ్రత చర్యలు, శీఘ్రంగా సేవలు ఉచితంగా అందించడంతో పాటు నిత్య అన్నప్రసాద సముదాయం, వైకుంఠం, దివ్యదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, రద్దీ కూడళ్లలో అన్నప్రసాదం, జలప్రసాదం వితరణ చేస్తున్నట్లు వివరించారు. ఈ సేవలన్నీటినీ విస్తరించడానికి యంత్రాంగాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు. భక్తులకు అందిస్తున్న సేవలను పరిశీలించగా అన్నింటా చక్కగా ఉన్నట్లు తన దృష్టికి వచ్చినట్లు ఈవో వివరించారు. లగేజీని పూర్తిగా ఒక సంచిలో ఉంచి తాళం వేసి ఇవ్వడంతో ద్వారా దాచిపెట్టడానికి తితిదే, తిరిగి పొందడానికి భక్తలకు సులభంగా ఉంటుందని సూచించారు. ప్రధాన కల్యాణకట్టలో 3 సముదాయాలను ఆధునికీకరించామని, మిగిలిన వాటిని ఈనెల 15లోపు పూర్తి చేస్తామని తెలిపారు. వేడి నుంచి యాత్రికులకు ఉపశమనం కలిగించే చర్యలు ప్రారంభించామని చెప్పారు. వసతి గదులను పరిశీలించి లోటుపాట్లను సరిచేస్తున్నట్లు వివరించారు.