అమరావతి : ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగినట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలోని అసెంబ్లీలో ఇవాళ మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తన స్వప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకోలేదన్నారు. ఏపీ ప్రజల ప్రయోజనం కోసం ఇలా చేశానన్నారు. గత నాలుగేళ్లలో ఢిల్లీకి 29 సార్లు వెళ్లానని, అనేక సార్లు ప్రత్యేక హోదా గురించి అడిగానని ఆయన గుర్తు చేశారు. మోదీ సర్కార్ తన చివరి బడ్జెట్లో ఏపీ గురించి ప్రత్యేక నిధులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. అందుకే తమ మంత్రులు క్యాబినెట్ నుంచి బయటకు వచ్చారన్నారు. విభజన హామీలు ఇంత వరకు నెరవేర్చలేదన్నారు. ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేరిస్తే ఈ సమస్య ఉండేదికాదన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. మనోభావాలతో నిధులను పెంచలేమని జైట్లీ అన్న మాటలను బాబు తప్పుపట్టారు. జైట్లీది నిర్లక్ష్య ప్రకటన అని అన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సెంటిమెంట్ ఆధారంగానే ఇచ్చారని, ప్రజల మనోభావాలు చాలా శక్తివంతమైనవని, ఇప్పుడు కూడా కేంద్రం అన్యాయం చేస్తోందని బాబు ఆరోపించారు. గతంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నామని, ఇలాంటి పరిస్థితులను ఈజీగా దాటేస్తామన్నారు. ప్రధాని లేఖ రాసినా ప్రయోజనం లేకుండాపోయిందన్నారు.