న్యూఢిల్లీ: శనివారం వెలువడిన మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీను గెలిపించిన ఈశాన్య రాష్ర్టాల ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈ మూడు రాష్ర్టాల ఫలితాలపై మోదీ స్పందిస్తూ.. పార్టీ సిద్ధాంతాల కోసం ఎంతో మంది కార్యకర్తలు ప్రాణాలు అర్పించారన్నారు. ఈ విజయం బీజేపీ కార్యకర్తలకు అంకితం ఇస్తున్నట్లు చెప్పారు. వామపక్షాలకు ప్రజలు ఓటు ద్వారా జవాబు చెప్పారన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని.. పరాజయాన్ని కూడా సగౌరవంగా స్వీకరించాలని తెలిపారు. ప్రజల మనసు గెలిస్తే ఎన్నికల్లోనూ గెలుస్తామన్న దానికి ఈ గెలుపే నిదర్శనమన్నారు. ఢిల్లీ తమకు దూరం ఉందని ఈశాన్య రాష్ర్టాల ప్రజలు భావించేవారు. కానీ తాము ఢిల్లీని ఈశాన్య రాష్ర్టాల ప్రజల చెంతకు తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ప్రతి నెల ఒక కేంద్రమంత్రి ఈశాన్య రాష్ర్టాల్లో పర్యటించేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. కేరళ, త్రిపుర, పశ్చిమబెంగాల్, ఒడిశా, కర్ణాటకలో బీజేపీ కార్యకర్తల హత్యలు జరిగాయి. బీజేపీ కార్యకర్తల త్యాగాన్ని వృథా కానీయమన్నారు. కాంగ్రెస్ సంస్కృతి చొరబడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అదేవిధంగా ఈశాన్య రాష్ర్టాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా కృషి చేసిన ఈసీ, భద్రతాదళాలకు ప్రధాని అభినందనలు తెలిపారు.