ఏలూరు : సీఆర్ఆర్ కళాశాల యాజమాన్యం వివిధ కారణాలతో విద్యార్థులకు హాల్టిక్కెట్లు మంజూరు చేసేందుకు నిరాకరించటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. హాల్టిక్కెట్లు ఏ కారణాలతోనైనా ఆపితే కఠిన చర్యలు తప్పవని ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నతాధికారులు హెచ్చరించినా.. యాజమాన్యాలు పట్టించుకోవటంలేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం ఉదయం కళాశాలకు వెళ్ళిన విద్యార్థులు హాల్ టిక్కెట్లు ఇవ్వాలని కోరగా, ఇవ్వమంటూ యాజమాన్యం తెగేసి చెప్పడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థులకు మద్దతుగా ఏబీవీపీ నాయకులు శ్రీకాంత్తోపాటు మరికొందరు విద్యార్థి నాయకులు కళాశాల వద్ద బైఠాయించారు. సాయంత్రం వరకూ కళాశాల వద్ద బైఠాయించినా సమాధానం చెప్పకపోవటంతో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. త్రీటౌన్ పోలీసులు పరిస్థితిని అదుపుచేసేందుకు విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేశారు.