ఏపీ విపక్ష పార్టీ వైకాపావి కుట్రపూరిత రాజకీయాలని తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడుతున్న ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము పార్లమెంటులో పోరాడుతుంటే….రాజకీయ ప్రయోజనాల కోసం వైకాపా ఎంపీలు పీఎంవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారన్నారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేంద్రాన్ని రాజ్యసభలో నిలదీస్తే…కేంద్ర మంత్రి మంత్రివర్గ నిర్ణయాన్ని ఎలా ప్రశ్నిస్తారంటూ వైకాపా నాయకుడు విజయసాయిరెడ్డి పాయింట్ ఆఫ్ అర్డర్ లేవనెత్తుతారా? ఇదేనా రాష్ట్ర ప్రయోజనాల పట్ల వారికి ఉన్న చిత్తుశుద్ధి అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు 27 పేజీల నోట్ లో పేర్కొన్న వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా చేసినది ఏముందో చెప్పాలన్నారు. విభజన చట్టంలోని ఏ అంశంపై ఆ నోట్ లో స్పష్టత లేదన్నారు. పార్లమెంటులో తెరాస సభ్యులు, తృణమూల్ సభ్యలు కూడా ఏపీకి న్యాయం చేయాలని కోరుతూ ప్రసంగాలు చేస్తే రాష్ట్రంలోని విపక్షం మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను తుంగలోకి తొక్కుతూ విమర్శలు గుప్పిస్తోందని, రాజకీయం చేయాల్సిన సమయం ఇది కాదనీ, రాష్ట్ర ప్రయోజనాలకు సమష్టిగా పోరాడాల్సిన సమయం ఇదని రామ్మోహననాయుడు అన్నారు.