పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని అనంతపల్లి ఎర్రకాలువ సమీపంలో బస్సును లారీ ఢీకొన్న సంఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు
రాజమహేంద్రవరం నుంచి ఏలూరు వెళుతున్న కొవ్వూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును రాజమహేంద్రవరం వైపు వెళుతున్న లారీ అపసవ్య దిశలో వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తునికి చెందిన గేలం లక్ష్మి(50), కాపుశెట్టి జ్యోతి(37), కాపుశెట్టి అఖిల సత్య(12), కాపుశెట్టి శివసాయి(14), ఒడిశాకు చెందిన పల్లా సావిత్రమ్మ(60) మృతి చెందారు. తునికి చెందిన కాపుశెట్టి నాగేశ్వరరావు భార్య జ్యోతి, కుమార్తె అఖిల సత్య, కుమారుడు శివసాయితో కలిసి గురువారం నిడదవోలులోని అత్తవారింటికి వచ్చారు. అక్కడ నుంచి తన అత్త గేలా లక్ష్మితో కలిసి ఎర్నగూడెం వచ్చి ద్వారకా తిరుమల వెళ్లే నిమిత్తం బస్సు ఎక్కారు. ఒడిశాకు చెందిన పల్లా సావిత్రమ్మ, జోగచర్లలో ఉంటున్న తనపెద్ద కుమార్తె లక్ష్మి ఇంటికి వెళ్లేందుకు రాజమహేంద్రవరంలో బస్సు ఎక్కారు. వీరంతా 10 నిమిషాల్లో బస్సు దిగుతారనగా ప్రమాదం జరిగింది. భార్య, పిల్లలు, అత్త చనిపోవటంతో నాగేశ్వరరావు విలపించిన తీరుతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. తాడేపల్లిగూడెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.